దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి
ఘనంగా కల్వకుర్తి భవిత కేంద్రంలో వరల్డ్ డిసబిలిటీ డే వేడుకలు
టీఆర్టీఫ్ జిల్లాలో జనరల్ సెక్రటరీ మునగాల సతీష్ కుమార్
కల్వకుర్తి, డిసెంబర్ 3 (మనఊరు ప్రతినిధి): దివ్యాంగులు అత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని టీఆర్టీఫ్ జిల్లాలో జనరల్ సెక్రటరీ మునగాల సతీష్ కుమార్ సూచించారు. బుధవారం పట్టణంలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్, గేమ్స్, మ్యూజికల్ చైర్ వంటి పోటీల కార్యక్రమానికి ఎంఈవో శంకర్ నాయక్ అద్యక్షత నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన వారితో పాటు అందరికీ బహుమతులు అందజేయడం విద్యార్థుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. మేము కూడా సాధారణ పిల్లలమే అనే ఆత్మవిశ్వాసం కలిగేలా భవిత ఐఈఆర్పీ శ్యామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో శంకర్ నాయక్ మాట్లాడుతూ భవిత సెంటర్ ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఆశాకిరణం. రెండు లక్షల రూపాయల వ్యయంతో ముఖ్యమైన ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ ఏర్పాటు చేశాం. ఇటువంటి పిల్లలు ఎక్కడ ఉన్నా సమాచారం ఇస్తే ఇంటికే వెళ్లి కౌన్సిలింగ్ చేస్తాం. తల్లిదండ్రులు పిల్లలను కోపంతో కాకుండా ప్రేమతో ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఆర్టీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునగాల సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ మేధావులలో చాలామంది ఏదో ఒక సమస్యను అధిగమించినవారే కాబట్టి మన పిల్లలను వైకల్యంతో చూడకుండా మేధావుల వర్గంలో ఒకరిగా గుర్తించాలని, భవిత సెంటర్లు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పునాదులు అన్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మండల స్థాయిలో జాబ్ షెడ్యూల్ రూపొందించి, భవిత వేదికగా తరగతులు నిర్వహించేలా చూడాలని ఎంఈఓను అభ్యర్థించారు. దీనికి ఎంఈఓ సానుకూలంగా స్పందించి త్వరలోనే జాబ్ షెడ్యూల్ అమలులోకి వస్తుందని తల్లిదండ్రులకు తెలియజేశారు. స్పెషల్ ఎడ్యుకేషన్ చైల్డ్గా గుర్తించబడి ఇటీవల హెచ్డబ్ల్యూ ప్రాథమిక పాఠశాలకు చేరిన సాయి చరణ్కు ప్రత్యేక బహుమతిని ఎంఈఓ స్వయంగా ప్రదానం చేశారు. డ్రెస్సింగ్ కాంపిటిషన్లో మొదటి బహుమతి గెలుచుకున్న మునగాల హేమంత కృష్ణరాయను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల నాయకులు రాజు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్న విద్యార్థులు






