అంగరంగ వైభవంగా దేవతా విగ్రహాల ప్రతిష్ఠ

 కూచూరులో 

అంగరంగ వైభవంగా దేవతా విగ్రహాల ప్రతిష్ఠ

ప్రత్యేక పూజలు, హోమాలు,బోనాల ఉత్సవాలతో సందడి

జనసంద్రంగా మారిన కుచూరు













నవాబుపేట, మే 30 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని కూచూరు గ్రామంలో నిర్మించిన నూతన దేవాలయాల్లో  శుక్రవారం దేవతా విగ్రహాల ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు  వేలాదిమంది భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో చుట్టు ప్రక్కల ప్రధాన రహదారులన్నీ గ్రామంవైపే పరుగులు తీశాయి. ఉదయం పునః పూజలు, హోమాలు,  యంత్ర విగ్రహాల ప్రతిష్టాపన, బలి ప్రధానం, మహా మంగళహారతి, పూర్ణాహుతి, బ్రాహ్మణ సత్కారం, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ  కార్యక్రమాలతో దేవత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం సంపూర్ణమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మహిళలు గ్రామం నడిబొడ్డున నూతనంగా ప్రతిష్టించిన నాభిషిలకు జలాభిషేకం చేసి ఆ నీటితో తమ తల్లిగారి ఇళ్ల కడుపలు కడిగారు. అలాగే దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నాభిశిలకు బోనాలు సమర్పించారు. తల్లి దండ్రులు,సోదరులు  గ్రామానికి విచ్చేసిన ఆడపడుచులకు వడి బియ్యాలు పోశారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న బంధుమిత్రులతో కూచూరు గ్రామం జనసంద్రంగా మారింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కార్యక్రమ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, మాజి ఎంపి ఎం.శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కె.యాదయ్య, మాజీ జడ్పీటిసి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపిలు అనంతయ్య, శ్రీనివాస్, డిసిసి మాజీ అధికార ప్రతినిధి దుష్యంత్ రెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పెరుమాళ్ళ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మీనాక్షి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Previous Post Next Post