బ్యాంకర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి..
తొలి విడతలో రూ.లక్షలోపు రుణాల మంజూరు
రాజీవ్ యువవికాసానికి దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల మంది
- జూన్ 2న 5 లక్షల మందికి మంజూరు పత్రాల జారీలో భాగంగా కేటగిరి 1,2 యూనిట్లు కేటాయింపు
హైదరాబాద్, మే 23 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం యువత, వ్యవసాయం, మహిళా సాధికారత, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లో సమగ్ర పథకాలను అమలు చేస్తోంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లను రాజీవ్ యువ వికాసం పథకానికి సహకరించాలని కోరారు. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించి, రూ.6,250 కోట్ల సబ్సిడీని అందించనున్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. యువతకు ఉపాధి కల్పన నుండి గ్రామీణాభివృద్ధి వరకు.. వివిధ రంగాల్లో సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ 2వ తేదీన ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని ఆయన అన్నారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు వెన్నెముక వంటివని, వాటి పటిష్టత సమాజ ప్రగతికి, రాష్ట్ర పురోభివృద్ధికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించినట్లు డిప్యూటీ సీఎం వివరించారు. ఈ పథకానికి రూ.6,250 కోట్లు ఆర్థిక సహాయంగా అందించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి.. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GDP) పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ బృహత్తర పథకం అమలులో అన్ని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని.. యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారిని వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే ఒక సమగ్ర కార్యక్రమమని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో ఉద్యానవన పంటలకు పెద్దపీట వేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. ఇది రైతులకు అధిక ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. రైతుల రుణ భారాన్ని తగ్గించేందుకు రూ.21 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను ఇప్పటికే బ్యాంకుల్లో జమ చేశామని.. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా.. రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చి.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.