మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ డి. జానకి

 మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ డి. జానకి


మహబూబ్‌నగర్, మే 29 (మనఊరు ప్రతినిధి): జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి. జానకి, ఐ.పి.ఎస్ గురువారం సాయంత్రం సందర్శించారు. స్టేషన్‌లోని కార్యకలాపాలను సమీక్షించి, మహిళల భద్రత, న్యాయం, సేవల విషయంలో మరింత పారదర్శకత, వేగవంతమైన స్పందన ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, "మహిళలు స్టేషన్‌కు రావడమే ధైర్యవంతమైన చర్య అని వారు తమ సమస్యలను చెప్పుకునే సమయంలో మనం పూర్తి బాధ్యతతో స్పందించాలన్నారు. స్టేషన్‌కు వచ్చిన ప్రతి మహిళకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. సానుభూతితో, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

షీ టీమ్ సిబ్బందితో మాట్లాడుతూ, "మీరు కేవలం స్పందించడమే కాకుండా, చురుకుగా పనిచేయాలని తెలిపారు. హరాస్‌మెంట్, ఈవ్-టీజింగ్, గృహ వేధింపులపై మరింత అప్రమత్తంగా ఉండాలి. స్కూళ్లు, కళాశాలల వద్ద నిఘా పెంచాలన్నారు. ప్రతి ఘటనను జాగ్రత్తగా రికార్డ్ చేసి, బాధితులకు ఆత్మవిశ్వాసం కలిగించేలా మద్దతు అందించాలని సూచించారు.

స్టేషన్‌లోని రికార్డులు, కేసుల ప్రగతి, పెండింగ్ విచారణలను పరిశీలించిన ఎస్పీ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, WSI శైలజ, మహిళా పోలీస్ సిబ్బంది, షీ టీమ్ అధికారులు పాల్గొన్నారు.

Previous Post Next Post