*కవిత ఎపిసోడ్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్*
హైదరాబాద్, మే 30 (మనఊరు ప్రతినిధి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పందించారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్లో మీడియాతో మంత్రి పొంగులేటి చిట్చాట్ చేశారు. కవిత ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అని కొట్టిపారేశారు. ఒకరు ఆడమంటారు మరొకరు ఆడతారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కటి కాదు చాలా తప్పులు చేశారని... అన్నిటికి శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ దగ్గర దెయ్యాలు ఉన్నాయని కవిత అంటున్నారని.. ఆ దెయ్యాలు ఎవరో కవితనే చెప్పాలని అన్నారు. దేవుడు, దెయ్యాలు అంటున్న కవిత నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. కవిత నోరు విప్పాలని.. ఆమె ఏం చెబుతుందో వినాలని తాము కూడా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్కి బీజేపీతో బంధం ఉందని కవిత స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని అంగీకరించారని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.
మాజీమంత్రి కేటీఆర్కు ఈడీ అంటే ఉత్సాహం ఎక్కువగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈడీ అధికారులు తన ఇంటికి ఎప్పుడూ రాలేదని... వారు తన ఇంటికి ఎందుకు రావట్లేదో.. కేటీఆర్ అడిగితే బాగుంటుందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్కు దోస్తానా ఉందని ఆరోపించారు. కవితనే ఆ విషయం స్వయంగా చెబుతున్నారని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సీఎం రేవంత్రెడ్డిని కలవడం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.. కానీ అర్ధరాత్రయినా రాహుల్గాంధీని కలిసే చనువు రేవంత్రెడ్డికి ఉందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.
గత కేసీఆర్ ప్రభుత్వంలోని భూభకాసురుల సంగతి త్వరలో తెలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎవరిని పిలవాలో తమ ప్రభుత్వం చెప్పదని తేల్చిచెప్పారు. ప్రభుత్వమే చెప్పేది ఉంటే కేసీఆర్నే ముందు పిలవాలని చెప్పేవాళ్లమని అన్నారు. కాళేశ్వరంలో ఎల్ అండ్ టీ కంపెనీ కూడా ముద్దాయిగా ఉందని చెప్పారు. తప్పు చేసి దొరికి కూడా తండ్రి, కొడుకులు(కేసీఆర్, కేటీఆర్) దబాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పుచేసిన వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.