బాలానగర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి
బాలానగర్, జూన్ 24 (మనఊరు ప్రతినిధి): బాలానగర్ మండలంలోని పోలీస్ స్టేషన్ ను మంగళవారం జిల్లా ఎస్పీ డి. జానకి సందర్శించారు. వార్షిక తనఖీలో భాగంగా స్టేషన్ కు వచ్చిన ఎస్పీని ఎస్సై లెనిన్ స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అదే విధంగా సిబ్బంది పని తీరు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలని, స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలు కాపాడుతూ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూడాలని సూచించారు.
ఇసుక అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లను నవీకరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ప్రతి కేసులో నాణ్యత మరియు పారదర్శకతతో విచారణ జరిపి, శిక్షల శాతం పెంచే దిశగా కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో 5S అమలు తీరును పరిశీలించి, ఫైళ్ల నిర్వహణ పద్ధతులపై మార్గనిర్దేశం చేశారు.
ట్రాఫిక్ పరిస్థితులపై ఎస్పీ ప్రత్యేక దృష్టి
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్పీ గారు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రతి పోలీస్ అధికారి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని, హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు మరియు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ను మరింతగా పెంచాలని, రాత్రి పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజల రక్షణే తమ ధ్యేయమని, అందుకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రమణారెడ్డి, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, సర్కిల్ నందు మిగతా ఎస్సైలు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.