పాత డిజైన్ ప్రకారమే జాతీయ రహదారి పనులు
జడ్చర్ల పట్టణ ప్రజలు ఆందోళన చెందవద్దు
మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి
జడ్చర్ల రూరల్, జూన్ 2 (మనం న్యూస్) : జాతీయ రహదారి అథారిటీ ప్రకారమే జడ్చర్ల టు కోదాడ మరొక హైవే జడ్చర్ల టు చించోలి వరకు పనులు జరుగుతున్నాయని జడ్చర్ల పట్టణ ప్రజలు ఆందోళన చెందవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి అథారిటీ వారు డిజైన్ చేసిన ప్రకారంగానే ఇందిరా గాంధీ, నెహ్రూ విగ్రహాలను తొలగించకుండానే రోడ్డు పనులు జరుగుతున్నాయని అలాగే అంబేద్కర్ విగ్రహం వద్ద సర్కిల్ ఐలాండ్ ప్రకారమే పనులు జరుగుతాయని తెలిపారు. పాత బజారు రావడానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవని తెలిపారు. రోడ్డుకు అటుపక్క 50 ఫీట్లు ఇటుపక్క 50 ఫీట్లు రోడ్డు కటింగ్ జరుగుతుందని ఈ పరిధిలో ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం రాదని అన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పిస్తామంటే మాకు సంతోషమేనని అన్నారు. మాకు ఎలాంటి రాజకీయ భేషజాలు లేవని తెలిపారు. పాత బజార్ ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రోడ్డు పనులు పూర్తయితే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. జాతీయ రహదారి డిజైన్ మా చేతిలో ఉండదని జాతీయ రహదారి అథారిటీ వాళ్లు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుష్పలత, పిట్టల మురళి, ప్రణీల్ చందర్, అపీజ్, జి. సత్యం, వీడియో శ్రీను, పర్వత రెడ్డి, కౌన్సిలర్లు, పాత బజార్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.