అంగరంగ వైభవంగా దేవతా విగ్రహాల ప్రతిష్టాపనోత్సవాలు

 అంగరంగ వైభవంగా దేవతా విగ్రహాల ప్రతిష్టాపనోత్సవాలు

కార్యక్రమంలో భాగంగా దేవతా విగ్రహాల భారీ ఊరేగింపు





నవాబుపేట, మే 29 మన   మండల పరిధిలోని కూచూరు గ్రామంలో నిర్మించిన నూతన దేవాలయాల్లో దేవతా విగ్రహాల ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజైన గురువారం వేదపండితులు విగ్రహాలకు పునఃపూజలు,విగ్రహ మూల మంత్ర హోమాలు,ఆవాహిత దేవత పూజలు,హోమాలు, జలాధివాస,చతుర్వేద పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు భజన సంకీర్తనలతో భాజా భజంత్రీలు సన్నాయి వాయిద్యాల చప్పుళ్లతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు.ఈ కార్యక్రమాల నిర్వహణకు వరుణ దేవుడు పూర్తిగా కార్యక్రమ నిర్వాహకులకు సహకరించాడు. గత వారం రోజులుగా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసిన వరుణుడు గురువారం ఊరేగింపు సందర్భంగా ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిదానించాడు. విగ్రహాలను అలంకరించిన వాహనాలకు గ్రామంలోని మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి దేవతా విగ్రహాలకు నీరుతో సాకలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతా విగ్రహాలను ముందుకు సాగనంపారు. కార్యక్రమాలలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు కార్యక్రమం నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ చేశారు.

శుక్రవారం ఉదయం పునః పూజలు, హోమాలు, యంత్ర విగ్రహాల ప్రతిష్టాపన, బలి ప్రధానం, మహా మంగళహారతి, పూర్ణాహుతి,బ్రాహ్మణ సత్కారం, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో దేవత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం సంపూర్ణమవుతుంది. విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎంపి డికె అరుణ, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పెరుమాళ్ళ శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. అందువల్ల హైందవ బంధువులు అధిక సంఖ్యలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని దేవతా విగ్రహాల ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమ నిర్వాహకులు కోరుతున్నారు.

Previous Post Next Post