పేద మహిళల ఆర్ధిక లక్ష్యాన్ని నీరుగార్చకండి

 *పేద మహిళల ఆర్ధిక లక్ష్యాన్ని నీరుగార్చకండి*

*డీఆర్డీవో చిన్న ఓబులేశు*  



బిజినఫల్లి, జూన్ 6 (మనఊరు ప్రతినిధి): పేద మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాలని, సమాజంలో, కుటుంబంలో  తమ కంటూ ఒక గుర్తింపు ఏర్పర్చుకునే గొప్ప లక్ష్యం తో ప్రభుత్వం మహిళా సంఘాల కు స్త్రీనిధి, బ్యాంకు లింకేజి  ద్వారా  అత్యవసర, జీవనోపాధి  రుణాలు అందచేస్తోందని అయితే కొందరిఅవగాహన రహిత్యమైన చర్యల కారణంగా తీసుకున్న అప్పు సరైన వాయిదాలు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకు పోయి ఆ లక్ష్యం నీరుగారుతోందని, పేద మహిళలకు ఋణ సదుపాయం అందించేందుకు అవకాశం లేకుండా పోతోందని డీఆర్డీవో చిన్న ఓబులేశుఅన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో  స్త్రీనిధి రుణాల మొండి బకాయి దారులతో ప్రత్యేక  అవగాహనా సమావేశంనిర్వహించారు. గ్రామ సంఘం పరిధిలోని  చిన్న సంఘాల్లో ఏ ఒక్క సభ్యురాలు బకాయి ఉన్నా ఆ సంఘాలు స్త్రీనిధి ఋణ మంజూరుకు అర్హత కోల్పోతాయన్నారు.

సభ్యులు తాము తీసుకున్న అప్పులను క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలని దీని వల్ల అన్ని సంఘాలు రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీకి అర్హులవుతారని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, మహిళలను కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యం తో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు  వివిధ జీవనోపాధులకై రుణాలను, సబ్సిడీపై కొన్ని పథకాలను అందిస్తుందని సంఘ సభ్యులు సంఘటితంగా ఉండి మొండి బకాయిలు ఏర్పడకుండా తమ గ్రామసంఘ నిర్వహణ జరుపుకొని అందరికి ఆదర్శంగా ఉండాలని అయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి రీజినల్ మేనేజర్ మహేంద్రకుమార్ , మేనేజర్ విక్రమ్ కుమార్, సీసీ రామస్వామి, వీవోఏలు, పలు సంఘాల లీడర్ లు, సభ్యులు పాల్గొన్నారు .

Previous Post Next Post