సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది
జడ్పీహెచ్ఎస్ కోడ్గల్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు
జడ్చర్ల రూరల్, జూన్ 11 (మనఊరు ప్రతినిధి): సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడుగల్ ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని ఈర్లపల్లి, ఈర్లపల్లి తండాలో పాఠశాల హెచ్ఎం మారేపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందంతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, పౌష్టికాహార వసతులు, IFB ప్యానెల్ బోర్డులు డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైన క్రీడా మైదానం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం వంటి అనేక సౌకర్యాలు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిభను గుర్తించి సమగ్ర అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు, సృజనాత్మక శిక్షణలు నిర్వహించబడుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా వారి భవిష్యత్తు పునాదికి నాంది పలకాలని తెలిపారు. ఉపాధ్యాయులు మల్లికార్జున్, తాహెర్, రామనాథం, రవికుమార్ గ్రామ పెద్దలు, తండా నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుని విజ్ఞప్తి పట్ల గ్రామస్తులు సానుకూలంగా స్పందించారు. పిల్లల విద్యాభవిష్యత్తును బలపర్చడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తాము ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్, తాహేర్, రామనాథం, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.