*కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలపై శిక్షణ శిబిరం,
కేజీబీవీలో కొత్త మెనూ ఫుడ్, ఇక పై మాంసంతో పాటు గుడ్లు జిసిడిఓ శోభారాణి*
*కేజీబీవీల విద్యార్థినుల సంపూర్ణాభివృద్ధికి ముందడుగు*
కల్వకుర్తి మన ఊరు ప్రతినిధి 10 : కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని కల్వకుర్తి కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా, పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం మంగళవారం నిర్వహించినట్లు జీసీడీవో శోభారాణి తెలిపారు.
జిల్లాలోని 20 కేజీబీవీలో వంట చేసే 94 మంది మహిళలకు 12 రకాల వంటలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి, రుచికరమైన వంటల తయారీపై ప్రావీణ్యాన్ని అందజేశామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా శోభరాణి మాట్లాడుతూ.... జిల్లా లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో, విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ మెనూను మారుస్తూ నిర్ణయం తీసుకుందని ఆమె చెప్పారు.
కేజీబీవీల్లో ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త ఫుడ్ మెనూ అమలులోకి రానుందని,కేజీబీవీ బాలికలు ఈ విద్యా సంవత్సరంలో సరికొత్త వంటకాలను రుచి చూడనున్నట్లు తెలిపారు.
గురుకుల విద్యాలయాల తరహాలో కేజీబీవీల్లోనూ మెనూ ఉండాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆ మేరకు జిల్లాలోని 20 కేజీబీవీల్లో చర్యలు తీసుకున్నామన్నారు.
కొత్త ఆహార పట్టికలో కీలక మార్పులతో దాని ప్రకారం నెలకు రెండుసార్లు మాంసాహారం వడ్డిస్తారని, వారంలో ఐదుసార్లు గుడ్లు అందిస్తారు. ప్రతిరోజు ఆహారంలో నెయ్యి చేరుస్తామని చెప్పారు.
ఈ మార్పులు బాలికల ఆరోగ్యానికి, పోషక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయని కేజీబీవీ పర్యవేక్షణ అధికారిని శోభారాణి తెలిపారు.
కొత్త వంటకాల తయారీపై వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా నేడు అందించడం జరిగిందన్నారు.
ఒక్కో విద్యార్థినికి గతంలో నెలకు రూ.1225 ఉన్న మెస్ ఛార్జీలను ప్రభుత్వం తాజాగా రూ.1740కి పెంచింది. దీనివల్ల ఒక్కో విద్యార్థినికి అదనంగా రూ.515 ఖర్చు చేయనున్నరని,
ఈ పెంపు నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి దోహదపడుతుందని ఆమె తెలిపారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన కస్తూర్బా బాలికల విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయని, ఆ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 కేజీబీవీల్లోని బాలికలకు ఈ మెనూ ద్వారా ప్రయోజనం అందుతుందని ఆమె తెలిపారు.
కొత్త మెనూను విద్యాలయాల్లో ప్రదర్శించడమే కాకుండా బాలికల తల్లిదండ్రులకు కూడా ఆహార పట్టికపై అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.
*కొత్త మెనూ ఇదే*....
ఉదయం: జీరా రైస్, టమాట కిచిడి, సాంబారు, రాగి జావ, ఉప్మా, పూరి, పులిహోర, బోండా, వడ, చపాతి, బూస్టు, అరటి పండు,మధ్యాహ్నం: టమాట పప్పుతో అన్నం, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్డు, చికెన్, నెయ్యి,సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, బెల్లం-పల్లీలు, అల్లం ఛాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి, ఎగ్ బజ్జీ,రాత్రి: వివిధ రకాల కూరలతో అన్నం, మజ్జిగ, సాంబారు.ఇది కేవలం ఆహార మెనూ మార్పే కాకుండా విద్యార్థినుల సంపూర్ణాభివృద్ధికి తీసుకున్న మంచి ముందడుగు కూడా. బాలికలు ఆరోగ్యంగా, శక్తివంతంగా పెరగాలంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్తో కూడిన ఆహారం ఎంతో అవసరం అని,
ఈ మార్పుతో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో కేవలం విద్యలోనే కాకుండా ఇతర కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొనేలా చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల ప్రత్యేక అధికారులు , వంట చేసే మహిళలు తదితరులు పాల్గొన్నారు.