*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*
*30 వసంతాల తరువాత అపూర్వ కలయిక
*2 లక్షల వ్యయంతో గార్డెన్ లో నెట్ హౌస్ నిర్మిస్తామని హామీ
*ప్రతి సంవత్సరం ఇలాగే కళాశాల అభివృద్ధి లో పాలుపంచుకుంటామన్న విద్యార్థులు
*మొక్క నాటి నీళ్లు పోసిన పూర్వ విద్యార్థులు
జడ్చర్ల రూరల్, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1993-96 బ్యాచ్ బీఎస్సీ విద్యార్థులు తేదీ 1 జూన్ 2025 రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు 30 వసంతాల తరువాత కళాశాలలో ని అలుమ్ని అసోసియేషన్ హాల్ లో సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరికొకరు బాగోగులు తెలుసుకున్నారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించిన పూర్వ విద్యార్థులు కళాశాలలో ఏర్పాటుచేసిన తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించి గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య గారిని అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. గార్డెన్ కు అవసరమైన నెట్ హౌస్ ఏర్పాటు గురించి వారు అడగగా స్పందించిన పూర్వ విద్యార్థులు సుమారు రెండు లక్షల వ్యయంతో ప్రత్యేకంగా ఒక నెట్ హౌస్ ను స్వయంగా తామే నిర్మించి ఇస్తామని చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అనుమతినిచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సుకన్య గారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గార్డెన్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన డా. సదాశివయ్య ను ఇటీవల జీవవైవిధ్య పరిరక్షణ అవార్డ్ పొందిన రమాదేవిని శాలువా తో సత్కరించారు. అనంతరం తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో మొక్క నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమన్వయకర్తలు భాస్కర్ యలకంటి, డాక్టర్ సరయు భరత్ గౌడ్, పండ్ర ప్రగడ వెంకటేశ్వరరావు, రత్నశేఖర్ కల్వోజు, మేడిశెట్టి శ్రీనివాసులు, వడిత్యావత్ సర్దార్ నాయక్, చింతకాయల నాగరాజు, నాగిరెడ్డి, నాగేందర్, లక్ష్మి, స్వరూప, నీలిమ, ఇందుమతి, ఉమాదేవి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.