ఆపరేటర్ బైక్కు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు
ఊర్కొండ, జనవరి 14 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ బైక్ను గుర్తు తెలియని దుండగులు అగ్నికి ఆహుతి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… మాధారం విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న మహేష్ ఎప్పటిలాగే రాత్రి డ్యూటీకి హాజరై విధులు నిర్వహించిన అనంతరం సబ్ స్టేషన్లోని తన గదిలో నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆపరేటర్ గదిని బయటి నుంచి తాళం వేసి, సబ్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహేష్ బైక్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అగ్నికి ఆహుతైన బైక్ పూర్తిగా కాలిపోయింది. ఉదయం గమనించిన మహేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడ్డ దుండగులను త్వరలోనే గుర్తించి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో సబ్ స్టేషన్ ఉద్యోగులు, గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
