ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణం, గోపూజ, గణపతి హోమంతో వైభవంగా పూజలు

నాగర్‌కర్నూల్, జనవరి 19 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నాడు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహాభిషేకం, ధ్వజారోహణం, అఖండ దీపారాధన, గోపూజ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను దేవాలయ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం ప్రారంభించగా, ఆలయ ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్ అర్చక బృందంతో కలిసి నవగ్రహ పూజలు, పుణ్యవాచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దొడ్ల ఈశ్వర్ రెడ్డి–ఇందుమతి దంపతులు ప్రత్యేకంగా పాల్గొని గణపతి హోమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం నాడు సరస్వతి అమ్మవారి మూలవిరాట్‌కు సామూహిక అభిషేకాలు, ప్రాతఃకాల పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు నవగ్రహ హోమం, గో కల్యాణం, గోతులాభారం కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఓం శ్రీ రక్షా కోలాట బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు గోమాతలతో ఊరేగింపు, అనంతరం ప్రదోషకాల పూజలు జరగనున్నాయి. చిన్నారులకు ప్రతిరోజూ అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ, వేద ఆశీర్వచనం నిర్వహించగా, నిత్య అన్నప్రసాద సత్రంలో సామూహిక భోజనాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు నారాయణ రెడ్డి, మిడిదొడ్డి పాండు రంగయ్య, సోమిశెట్టి రవికుమార్, దొడ్ల ఇందుమతి, భూపాల్ రెడ్డి, ఆళ్లంపల్లి శివకుమార్, మాధవి, అర్చకులు పవన్ కుమార్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.








Previous Post Next Post