గిరిజన బిడ్డ ఆర్టీసీ బస్సు మహిళా మొదటి డ్రైవర్ సరిత
విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. ‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు.ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. విద్య, వైద్యం, రాజకీయాలు, స్పోర్ట్స్ సహా ప్రతీ రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు.అదే స్ఫూర్తితో ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత (Driver Saritha) రికార్డు సృష్టించారు. శనివారం విధుల్లో చేరిన ఆమె.. మొదటిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపారు. ఇన్నిరోజులు ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వహించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. సీత్యతండాకు చెందిన వాంకుడోతు సరిత.. రాంకోటి, రుక్కా దంపతుల ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి. నలుగురు అక్కల పెండ్లి కోసం తన తండ్రి ఉన్న మూడెకరాల భూమిని అమ్మేయడంలో కుటుంబ పోషణ భారమైంది. దీంతో అక్క దగ్గర ఉంటూ నల్లగొండ జిల్లా దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అక్కడ నుంచి 10వ తగతి వరకు ఓపెన్ స్కూల్లో విద్యను అభ్యసించారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో కుటుంబ బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో ఆటో నడటం నేర్చుకున్నారు. ఐదేండ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యతండా వరకు ఆటో నడిపారు. అనంతరం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుని హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. 2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవడంతో దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మహిళలను డ్రైవర్లుగా తీసుకోలేమని ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈ క్రమంలో ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో ఢిల్లీకి వెళ్లిన సరిత.. కొన్నాళ్లపాటు కారు నడిపారు. రెండేండ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అందులో సరిత ఒక్కతే ఎంపికయ్యారు. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్గా గుర్తింపు పొందారు. ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చూస్తూ రోజూ 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నాటి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం, కిరణ్ బేడీ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ‘ఉమెన్ అచీవర్స్’ అవార్డును అందుకున్నారు.
అయితే, ఢిల్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటంతోపాటు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని, సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్గా ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సును నడిపి ఆర్టీలో తొలి మహిళా డ్రైవర్గా నిలిచారు.