ప్రయివేటులో పుస్తకాల దందా

 ప్రయివేటులో పుస్తకాల దందా పేరుతోనూ దోపిడీ

పాఠశాలలోనే కొనాలంటూ నిబంధన


విద్యార్థులకు విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన పుస్తకాలు, నోటుబుక్కులు 

బాలానగర్, జూన్ 14 (మనఊరు ప్రతినిధి): తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఒకే ఒక్క ఆశ, ప్రయివేటు పాఠశాలలకు ఆదాయం తెచ్చి పెడుతోంది. తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యాలు వేలకు వేలు ఫీజుల భారం మోపుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధించి వారి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంఇఒ కార్యాలయం ద్వారా పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే విద్యార్థులకు పుస్తకాలను ఇవ్వాలి. నోటు పుస్తకాలు విద్యార్థుల అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయాల్లో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాల కొనుగోలు ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. నిబంధలకు విరుద్ధంగా విద్యార్థులకు అవసరమైన వస్తువులు అన్నీ తమ దగ్గరే కొనుగోలు చేసి తీరాల్సిందేనంటూ ప్రయివేటు, విద్యాసంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో తప్పక అడిగిన డబ్బులు చెల్లించి షాపుల్లో మాదిరిగా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. మౌలిక వసతుల లేమి, విద్యార్థులకు సరిపడా ఆటస్థలాలు లేవు. తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇలా అరకొర వసతులతో పాఠశాలలు నిర్వహిస్తున్నా, ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి మరి వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలోని  ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకున్నా.. పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ఓ ప్రైవేటు పాఠశాల నూతన షాపును తెరిచి అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్ట పగలే ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్య అర్హత కలిగిన టీచర్లు లేరని, మరుగుదొడ్లు సరిగా లేవన్నారు. పదో తరగతి, ఇంటర్ చదివిన వారితో తక్కువ వేతనాలు ఇచ్చి విద్య బోధన చేయిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో పాఠశాలలు తెరవగానే ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉండడం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలల యజమానులు దోపిడి చేస్తున్న విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో.. అనేక అనుమానాలకు రేకెత్తిస్తుందన్నారు. ఈ ఘటనపై ఎంఈఓ శంకర్ నాయక్ ను వివరణ కోరగా.. సోమవారం పాఠశాలకు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలను సందర్శించి.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

Previous Post Next Post