గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత
సర్పంచ్, ఉపసర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి
కల్వకుర్తి, హైదరాబాద్, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై గ్రామపంచాయతీ నిధులకు సంబంధించిన చెక్కులపై సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్ ఇద్దరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇద్దరి సంతకాలు లేకుండా చెక్కులను బ్యాంకులు చెల్లించరాదని ఆదేశాల్లో పేర్కొంది. పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం, గ్రామస్థాయి పాలనలో జవాబుదారీతనాన్ని పెంచడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల గ్రామపంచాయతీల్లో నిధుల వినియోగంపై తరచుగా ఆరోపణలు రావడం నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు అయ్యేలా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, సంబంధిత శాఖలు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల్లో ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ మరింత బలపడటంతో పాటు, ప్రజల విశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
