దివ్యాంగులకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం
విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): దివ్యాంగులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలింకో), గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో జిల్లాలోని 728 మంది దివ్యాంగులకు రూ. 70.73 లక్షల విలువైన ఉపకరణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ల యాజమాన్యాలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ భవన నిర్మాణానికి 1,000 గజాల స్థలాన్ని కేటాయించినట్లు గుర్తుచేసిన ఆయన, ఆ స్థలంలో భవన నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగులు ఏ విషయంలోనూ తక్కువ కాదని, సమాజంలోని అన్ని రంగాల్లో సకలాంగులతో సమానంగా పోటీ పడుతూ ప్రతిభను నిరూపిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని పథకాల అమలులో స్వల్ప ఆలస్యం జరిగినప్పటికీ, ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్లు సీఏస్ఆర్, ఎడీబీ నిధులను వనపర్తి జిల్లాకు అధికంగా కేటాయించి జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 20 మందికి ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలింకో డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా కార్యనిర్వహక సంచాలకులు ఎం.కె. రమేష్, మార్కెట్ యార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీడబ్ల్యూఓ సుధారాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జలుఫిన్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, దివ్యాంగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మీసాల మోహన్, అధికారులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.




