ఆకలి తీర్చడమే నిజమైన సేవ
కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 350 మందికి అన్నప్రసాద పంపిణీ
కల్వకుర్తి, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): ఆకలితో ఉన్నవారికి అన్నప్రసాదం అందించడం గొప్ప మానవీయ సేవ అని కల్వకుర్తి ఎస్సై మాధవరెడ్డి అన్నారు. గురువారం లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జూలూరు రమేష్ బాబు కుమారుడు జూలూరు రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు, నిరుపేదలు ఆకలితో బాధపడకుండా వారి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎస్సై మధవరెడ్డి పేర్కొన్నారు. సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 350 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు చిగుల్లపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి కల్మిచర్ల గోపాల్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బ కిషన్, మాజీ కోశాధికారి గోవిందు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి దారమోని గణేష్, మేకల శ్రీనివాస్, శివ జగదీశ్వర్, మాచిపెద్దిఅశోక్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

