సర్పంచ్, ఉప సర్పంచ్కు ప్రభుత్వం కఠిన హెచ్చరిక
జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి పోయే ప్రమాదం
హైదరాబాద్, జనవరి 1 (మనఊరు ప్రతినిధి): గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణలో సర్పంచ్, ఉప సర్పంచ్కు ఉన్న జాయింట్ చెక్ పవర్ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. అభివృద్ధి పనుల కోసం వెచ్చించే ప్రతి రూపాయికి వీరిద్దరి ఉమ్మడి సంతకం తప్పనిసరిగా ఉండాలని, అదే సమయంలో ఈ అధికారం గ్రామాభివృద్ధికి ఉపయోగపడాల్సిందేనని పేర్కొంది.
జాయింట్ చెక్ పవర్ ప్రాముఖ్యత
గ్రామ పంచాయతీ నిధుల్లో పారదర్శకత కోసం జాయింట్ చెక్ విధానం కీలక భద్రతా వ్యవస్థగా ప్రభుత్వం వివరించింది. అయితే వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాలతో చెక్ సంతకాలను అడ్డుకోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిపారు.
గ్రామసభ తీర్మానమే ఆధారం
పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతి నిర్ణయం గ్రామసభ తీర్మానం ఆధారంగానే జరగాలని ఆదేశించారు. నగదు లావాదేవీలకు బదులుగా ఆన్లైన్ చెల్లింపులు చేయాలని సూచించారు. ఖర్చుల వివరాలను సమయానికి రికార్డుల్లో నమోదు చేస్తే ఆడిట్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. పారదర్శకత పాటిస్తేనే ప్రజాప్రతినిధులకు చట్టపరమైన రక్షణ ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.
అధికార దుర్వినియోగానికి జైలు శిక్ష తప్పదు
ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, పనులు పూర్తికాకుండానే బిల్లులు డ్రా చేయడం, తప్పుడు లెక్కలు చూపడం, సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి చర్యలను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, పదవి నుంచి తొలగించడమే కాకుండా జైలు శిక్ష విధించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉందని పేర్కొంది.
ఆధిపత్య పోరుతో అభివృద్ధికి అడ్డంకులు
కొన్ని గ్రామాల్లో సర్పంచ్–ఉప సర్పంచ్ మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధిని అడ్డుకుంటోందని అధికారులు గుర్తించారు. రాజకీయ కారణాలతో కావాలనే బిల్లులపై సంతకాలు చేయకుండా పనులను నిలిపివేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించింది. విచారణలో అభివృద్ధిని అడ్డుకున్నట్లు రుజువైతే, ఉప సర్పంచ్కు ఉన్న చెక్ పవర్ను రద్దు చేసే అధికారం కూడా కలెక్టర్కు ఉందని స్పష్టం చేసింది.
