ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి
వెల్దండ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కల్వకుర్తి, వెల్దండ, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ నమోదు విభాగం, ల్యాబొరేటరీ, ఇన్పేషెంట్ వార్డు సహా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అమలవుతున్న వైద్య సేవల తీరును పరిశీలించిన కలెక్టర్, పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన నూతన భవనాల నిర్మాణ పనులను పరిశీలించి, వాటిని వెంటనే పూర్తి చేసి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ వైద్యుల ప్రథమ కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్, వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

