ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నరేష్ తేజ
44వ రాష్ట్ర మహాసభల్లో ఎంపిక
జడ్చర్ల రూరల్, (మనఊరు ప్రతినిధి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన నరేష్ తేజను నియమించారు. శంషాబాద్లో ఇటీవల నిర్వహించిన 44వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షులు ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నరేష్ తేజ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఏబీవీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి పదవికి నరేష్ తేజ నియామకం కావడంతో జడ్చర్లతో పాటు పాలమూరు జిల్లాలోని ఏబీవీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
