మాఘ శుక్ల షష్టి సందర్భంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైలాభిషేకాలు
పరమశివునికి రుద్రాభిషేక పూజలు
బిజినేపల్లి, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): శ్రీ విశ్వవాసు సంవత్సరం మాఘమాసం శుక్ల షష్టి శనివారం నాడు మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలసిన శ్రీశనేశ్వర స్వామికి భక్తులు శని గ్రహ దోష నివారణ కోసం భక్తి శ్రద్ధలతో తిలతైలాభిషేక పూజలను వైభవంగా నిర్వహించారు. శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేక తిలతైలాభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, శివదీక్ష స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, ఈ మాసంలో శనేశ్వర స్వామిని భక్తితో ఆరాధిస్తే అత్యధిక ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరు జన్మరీత్యా, గోచారరీత్యా కలిగే శని గ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలన్నారు. అలాగే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు, అష్టమి, నవమి, శని త్రయోదశి, అమావాస్య రోజుల్లో స్వామివారిని కొలవడం విశేష ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. నువ్వుల నూనె, నువ్వులు–బెల్లం, జమ్మి ఆకు, నల్లని వస్త్రాలు, నీలిరంగు జిల్లేడు పూలతో పూజించి దానం చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. ఇదే ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించడంతో పాటు నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చన పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్, ప్రభాకరాచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు గవ్వమఠం శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

