పుష్య పౌర్ణమి నాడు శనేశ్వర స్వామికి వైభవంగా తిలతైల అభిషేకాలు
నంది వడ్డేమాన్లో శనిగ్రహ దోష నివారణకు ప్రత్యేక పూజలు
బిజినెపల్లి, జనవరి 3 (మనఊరు ప్రతినిధి): శ్రీ విశ్వవసు సంవత్సరం పుష్య మాసం శుక్లపక్షం పౌర్ణమి శనివారం సందర్భంగా బీజినేపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో తిలతైల అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శనిగ్రహ దోష నివారణ కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి తిలతైలాభిషేకాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ సార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శనేశ్వర స్వామి జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో పుష్య మాసంలో స్వామివారిని భక్తితో కొలిచిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన్మరీత్యా, గోచారరీత్యా కలిగే శనిగ్రహ దోష నివారణకు శక్తిమేరకు స్వామివారిని పూజించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పుష్య మాసంలో జనవరి నెలలో 10, 17 తేదీల్లో శనివారాలు రావడం విశేషమని, అలాగే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు, అమావాస్య రోజున శనేశ్వర స్వామిని దర్శించుకుంటే మరింత ఉత్తమ ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. స్వామివారికి ఇష్టమైన నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం, జమ్మి ఆకు, నల్లని వస్త్రాలు, నీలి రంగు జిల్లేడు పూలతో పూజలు చేసి దానం చేయడం ద్వారా శనేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుందని తెలిపారు. అలాగే ఈ ఆలయంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించగా, నందీశ్వర స్వామికి ప్రత్యేక అర్చన పూజలు చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్, ప్రభాకరాచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు గవ్వమఠం శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

