ఆరోగ్య మహిళా ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం
59 మందికి గర్భాశయ సమస్యలు గుర్తింపు
131 మంది గర్భిణీలకు ప్రత్యేక పరీక్షలు
డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్
నాగర్ కర్నూలు, జనవరి 20 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ‘ఆరోగ్య మహిళా’ ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం విజయవంతమైంది అని ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి. శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు జీవితకాలం ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమని, ముఖ్యంగా గర్భాశయ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ, ప్రొఫెసర్ డాక్టర్ సుప్రియల ఆధ్వర్యంలో వైద్య బృందం మొత్తం 190 మంది మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఇందులో 59 మందికి గర్భాశయ సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వారికి మూత్ర, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తదితర పరీక్షలు నిర్వహించగా, అవసరమైన చికిత్సతో పాటు మందులను ఉచితంగా అందజేశారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన 131 మంది గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ సౌమ్య, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శృతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ కావ్య, డాక్టర్ సుదీప్తి, డాక్టర్ మని, డాక్టర్ శిరీషలు గర్భిణీలను పరీక్షించి పలు సూచనలు, చికిత్సలు అందించారు. ప్రతి గర్భిణీ సుఖ ప్రసవం పొందేలా చర్యలు తీసుకుంటూ, గర్భస్థ సమయంలో, ప్రసవ సమయంలో, ప్రసవానంతరం ఆరోగ్యకర జీవన విధానంపై ప్రత్యేక కౌన్సిలింగ్ అందించారు. గర్భిణీలు అవసరమైన సమయంలో 102, 108 అంబులెన్స్ సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, పురిటి నొప్పులు, ఫిట్స్, బీపీ తదితర అత్యవసర పరిస్థితుల్లో ఉచిత రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, హెడ్ నర్స్ పద్మ, నర్సింగ్ అధికారులు ఎం. ఆనంద్, లలిత, రజిత, పద్మ, చిన్న చిన్నమ్మ, సుబేదా, పద్మావతి, రేణుక, హెల్ప్ డెస్క్ ఇన్చార్జ్ టి. యాదగిరి, సుజాత, అనిత, జ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
