శాకాంబరి అలంకరణలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి
దర్శించుకున్న భక్తులు
జడ్చర్ల రూరల్, జులై 6 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఆర్ అండ్ బి సమీపంలో 44వజాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడం మాసం తొలి ఏకాదశి, శాకంబరి ఉత్సవముల మహోత్సవం, పునర్వసు కార్తె పురస్కరించుకొని ఆదివారం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతను శాకాంబరి దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజ, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు పంచామృత నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షులు గోనెల నరేందర్, మహేశ్వరి దంపతులు మాట్లాడుతూ పెళ్లయిన కొత్త జంటలకు వివాహమైన తర్వాత మొదటిసారి వచ్చే ఆషాడ మాసంలో అమ్మవారిని దర్శిస్తే సకల శుభాలు అందిస్తుందని ఎంతో విశ్వాసంతో పెళ్లయిన కొత్త జంటలతో పాటు, అనేక మంది భక్తులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఆషాడ మాసంలో ప్రత్యేకంగా అమ్మవార్లను దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు జి. విజయ్ కుమార్ గౌతమీ ప్రియాంక దంపతులు, సభ్యులు మిద్దె నాగరాజు, బుక్క శివకుమార్, యాదగిరి, శ్రీశైలం, మహిళా భక్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.